కరోనా వైరస్‌: ప్లాస్టిక్‌, మొబైల్‌ ఫోన్లపై 72 గంటలు!

హైదరాబాద్‌: 70 ఏళ్లు పైబడిన వారికి కరోనా వైరస్‌ ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఏషియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఛైర్మన్ డా.నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. అయితే, ఇటలీ, ఫ్రాన్స్‌ దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా ప్రభావం తక్కువగా ఉందని చెప్పారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వైరస్‌ వ్యాప్తి, నియంత్రణకు సంబంధించిన పలు వివరాలు వెల్లడించారు. కోవిడ్‌-19 ఒకరి నుంచి మరొకరికి త్వరగా సోకుతుందని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం చాలా మంచిదని అభినందించారు. రాబోయే రెండు వారాల లాక్‌డౌన్ మరింత ముఖ్యమైనదని అన్నారు. స్వీయ నిర్బంధంతోనే కరోనాను అధిగమించగలమని స్పష్టం చేశారు.